హిందు మత సంస్థలపై జరుగుతున్న దాడులు, తిరుమల ఆచార వ్యవహారాలను ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కడపలో సాయిబాబాకు పూజలు నిర్వహించారు.
నియోజకవర్గ కేంద్రంలోని మునిసిపల్ స్టేడియం వద్ద గల షిరిడీ సాయిబాబా వారి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి వి.ఎస్.అమీర్ బాబు మీడియాతో మాట్లాడారు.
అన్యమతస్తులు తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలన్నది మొదటి నుండి వస్తున్న సంప్రదాయమని, అటువంటి సంప్రదాయాన్ని రద్దు చేయడానికి పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసలు హిందూ ధర్మముపై అవగాహన లేకుండా అవహేళనగా మాట్లాడుతున్నారని, దీని వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామి వారిపై ఉన్న విశ్వాసం దెబ్బతినేలా ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
శారద పీఠాధిపతి డిక్లరేషన్ అవసరం లేదని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడా కనిపించడం లేదు కానీ దేవాలయాలు పడగొట్టడంపై వికేంద్రీకరణ కనిపిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానమునకు వచ్చే కానుకలు డైవర్ట్ చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. హిందూ మతంపై ఈ ప్రభుత్వం చేసే కుట్రలను హిందువులు తిప్పికొడతారని అన్నారు.
శ్రీవారి లడ్డు రేట్లు పెంచి ప్రతి జిల్లాలో ఆ లడ్డులను మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు. తిరుపతి దేవస్థానం డైరీలు కూడా తగ్గించారని అన్నారు. పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు ప్రక్కనే సహధర్మచారిని ఉండాలనే సంప్రదాయం కూడా ప్రక్కనపెట్టారన్నారు.
ఈ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలు రాతి బొమ్మలు మాదిరిగా చూస్తున్నారని ఆరోపించారు. రథాలు తగలబెడితే ప్రభుత్వం బాధ్యత మరిచి వ్యవహరిస్తోందని ఆరోపించారు. హిందూ దేవుళ్ళ పట్ల, మంత్రి కొడాలి నాని (వేంకటేశ్వర రావు) మాటలు శోచనీయమని అన్నారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు హిందూ ధర్మమునకు వ్యతిరేకంగా ఉన్నాయని, మతాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉన్నాయని అన్నారు.
వెంటనే మంత్రి కొడాలి నాని హైందవ లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే వారి మంత్రి పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జయచంద్ర, శివ కొండా రెడ్డి, మాసా కోదండ రామ్, శివ రామ్, రాజశేఖర్, బాలదాసు, కొమ్మలపాటి, ఈశ్వరయ్య, సుధాకర్ యాదవ్, జనార్దన్ రెడ్డి, మాసాపేట శివ, వేంకటరమణ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.