రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తిపైనే విమర్శల దాడులు చేస్తుంటే ఏం చేయాలి? అదీ కూడా రాజ్యాంగ పదవుల్లోనే ఉన్న వారు చేస్తుంటే ఎలా?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పై ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్, తనను దారుణంగా విమర్శిస్తున్న మంత్రి కొడాలి నానిపై గవర్నర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను, వీడియో క్లిప్పింగ్స్ ను కూడా ఆయన గవర్నర్ కు సమర్పించారు. ప్రభుత్వంతో,అధికార యంత్రాంగంతో ఎన్నికల నిర్వహణపై సంప్రదింపులు జరుపుతుంటే ఉద్దేశ పూర్వకంగా మంత్రి కొడాలి నాని విమర్శలు చేస్తున్నారని డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉద్యోగులను ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను ఎన్నికల కమిషనర్ కోరారు.