నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వనపర్తి జిల్లాలో 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకూ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ కె.అపూర్వారావు తెలిపారు.
వైన్స్ దుకాణాలు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సమయం వరకే మద్యం విక్రయించాలని, సమయం దాటిన తర్వాత మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ పి హెచ్చరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా 20 టీమ్ లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించిన వారిపై ఎం.వీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. అర్ధరాత్రి 12:30 తర్వాత ఎవరైనా రోడ్డుమీద ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నట్లయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని షాపులలో లేదా ఖాళీ ప్రదేశాలలో సిట్టింగ్ లు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
సమయం ముగిసిన తర్వాత తెరచి బార్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచిన వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా టపాకాయలు కాల్చేవారిని, సౌండ్ సిస్టంలతో చికాకు పెట్టేవారిని ఉపేక్షించేది లేదని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా, బయట తిరగకుండా. మద్యం సేవించి స్నేహితులతో రోడ్డుపై ప్రయాణించకుండా చూసుకోవాలని లేకపోతే ప్రమాదాలకు గురియై అమూల్యమైన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఎస్ పి హెచ్చరించారు.
ఈ సంతోషకరమైన రోజును విషాదకరమైన దినంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. కొత్త సంవత్సరానికి ఎన్నో ఆశలతో, ఆశయాలతో, మరెన్నో లక్ష్యాలతో, ఎంతో సంతోషంతో స్వాగతం పలుకుతూ యువకులు, విద్యార్థులు,అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
వనపర్తి జిల్లా పరిధిలో పటిష్టమైన బందోబస్తు, నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అపరిచిత, అనుమానిత వ్యక్తులు కనబడితే విచారించి అదువులోకి తీసుకుంటాం. వాహనాలకు నెంబర్ లేకుండా, సరైన ధ్రువపత్రాలు, లైసెన్స్ లేకుండా నడుపు వాహనాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
డీజే లు నిషేధించామని, డీజేలు పెట్టుకుంటే సీజ్ చేసిచట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యపానం నిషేధించామని బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి