ఈ ఏడాది 70 శాతం సిలబస్ తోనే ఎంసెట్ను నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్ అకడమిక్ ఇయర్ను కుదించిన సంగతి తెలిసిందే. సిలబస్ ను కూడా 70 శాతానికి పరిమితం చేశారు. దీనికి అనుగుణంగా ఎంసెట్ పరీక్ష సిలబస్ ను కూడా తగ్గించాలని నిర్ణయించారు. 70 శాతం సిలబస్ నుంచే ఎంసెట్ ప్రశ్నలను రూపొందించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ.గోవర్థన్ తెలిపారు. కాగా, ఈసారి కూడా ఎంసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని రద్దు చేశారు. అలాగే ఇంజనీరింగ్ ప్రవేశాలకు కనీస అర్హత మార్కుల నిబంధనను కూడా రద్దు చేశారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే ప్రభుత్వం జారీ చేయనుంది.
ఎంసెట్ పరీక్ష కోసం తెలంగాణలో 100 కేంద్రాలను, ఏపీలో 8 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా ఎంసెట్తోపాటు ఇతర సెట్లు అన్నింటికీ గతేడాది మాదిరిగానే పరీక్ష ఫీజులను చెల్లించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. విద్యార్థులపై భారం మోపవద్దనే ఉద్దేశంతో ఫీజులను పెంచలేదని ఆయన తెలిపారు. అలాగే విద్యార్థులు పలు పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా ఆయా సెట్ల షెడ్యూల్ ను రూపొందించినట్టు ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు.