రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనకు తెర పడబోతున్నదా? ఆయన ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? ఈ ప్రశ్నలలో నిజం ఎంతో మనకు ఎవరికి తెలియదు కానీ సీనియర్ నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం కచ్చితంగా జగన్ ఇంటికిపోవడం ఖాయమని అంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి సంచలన విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు మళ్లీ అదే తరహాలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సైదాపురం లో జరిగిన వైఎస్సార్ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమకు అధికారం ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిపోయిందని అలాగే ప్రభుత్వం సచివాలయాల నిర్మాణానికి ఇచ్చిన సంవత్సర కాలం గడువు కూడా పూర్తయిపోయిందని అయినా ఇప్పటికీ సచివాలయాలు పూర్తి కాలేదని అన్నారు.
సచివాలయం నిర్మించిన, నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సంవత్సరం కాలం ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా ప్రభుత్వం ఇంటికి పోతుందని ఆయన అన్నారు. గతంలో కూడా రెండుసార్లు బహిరంగ సభలోనే ప్రభుత్వ తీరుపై రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఏమి అభివృద్ధి సాధించామని ప్రజలను ఓట్లు అడగాలి అని ఒక సారి, నేను అసలు ఎమ్మెల్యే నా అంటూ మరోసారి ఎలా ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.