గ్రామీణ ప్రాంతాలలో పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలలో తత్వం బోధపడ్డ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు జరగబోయే మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నది.
ఇందులో భాగంగానే పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉండే అగ్రకుల పేదలను టార్గెట్ చేసుకుంటున్నది. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ బిసిలకు, ఎస్ సిలకు, ఎస్ టిలకే పరిమితం అయి ఉన్నాయి.
తమ కళ్ల ముందే ఇతర కులాలకు అన్ని తాయిలాలు అందుతుండగా పేదరికంలో ఉన్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పట్టణ అగ్రకుల పేదలు అనుకుంటున్నారు.
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ అగ్రకుల పేదలు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పంచాయితీ ఎన్నికలలో 90 శాతం ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తే 16 శాతం మాత్రమే ఏకగ్రీవాలు అయ్యాయి.
ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో మరింత ఎక్కువ శ్రద్ధ చూపించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించింది.
అందుకే నేడు అమరావతిలోని సచివాలయంలో జరిగినమంత్రివర్గ సమావేశం లో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకంతో పట్టణ ప్రాంతాలలోని అగ్రకుల పేదలను తమ వైపునకు తిప్పుకోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.
ఆదాయ పరిమితితో అగ్రకులాల వారికి కూడా తాయిలాలు పంచిపెట్టేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం.
తక్షణమే దీనికి సంబంధించిన విధివిధానాలు విడుదల చేస్తే రాబోయే మునిసిపల్ ఎన్నికలలో అగ్రవర్ణ పేదలు మొత్తం తమకే ఓటు వేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.