కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ ప్రాణాలకు తెగించి పని చేస్తూ, ప్రజలను చైతన్య పరుస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాని ఆదుకోవడానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముందకు వచ్చారు.
ఎర్రబెల్లి ట్రస్టు తరపున ఆయన 16 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పని చేస్తున్న ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపిణీ చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరి నుంచి ఈ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్నే స్తంభింప చేసిందన్నారు. ఈ దశలో మీడియా విలేకరులు సైతం తమ ప్రాణాలకు తెగించి, పని చేస్తూ, సమాచారాన్ని మనకు, మిగతా ప్రపంచానికి చేరవేస్తున్నారన్నారు. మీడియాలోనూ రెక్కాడతే కానీ డొక్కాడని వాళ్ళున్నారని, మరికొందరు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.
పనుల్లో నిమగ్నమైన వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉడుతా భక్తిగా… తన వంతుగా కొంత మీడియా మిత్రులకు సాయంగా ఉండాలన్న సంకల్పంతోనే తమ ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో… కవరేజీలో మీడియా మిత్రులు సైతం జాగ్రత్తలు పాటించాలని, సామాజిక, భౌతిక దూరాన్ని కచ్చితంగా అమలు చేయాలని, అలాగే, తమ కుటుంబాలకు అండగా ఉండాలన్న ఆలోచనతో పని చేయాలని మంత్రి సూచించారు.