దేశ ప్రజలందరూ క్రమశిక్షణగల సైనికుల్లా చట్టాన్ని పాటిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కారణంగానే దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఆయన అన్నారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం ప్రారంభించారు. దేశ ప్రజలు ఎన్నో కష్టాలను భరిస్తున్నారని ఆయన అన్నారు.
చాలా మందికి తిండి దొరకలేదు, రవాణా వ్యవస్థ లేదు అయినా సహకరించారని ప్రధాని అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ నాడు చెప్పిన స్ఫూర్తి, సంకల్పం ఈనాటికీ దేశంలో చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నదని ప్రధాని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను ఆయన జయంతి సందర్భంగా తలుచుకోవడం అనివార్యమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే దేశంలో కరోనా కేసుల సంఖ్య చాలా వరకూ తగ్గిందని ఆయన అన్నారు. సమగ్ర విధానం అమలు జరిపి ఉండకపోతే దేశంలో ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయన అన్నారు. ఆ పరిస్థితి ఊహించడానికి కూడా కష్టంగానే ఉందని ప్రధాని అన్నారు. లాక్ డౌన్, భౌతిక దూరం ఇప్పుడు మంచి ఫలితాలను ఇచ్చిందని ఆయన అన్నారు.
ఆర్ధికంగా చూస్తే లాక్ డౌన్ ఎంతో నష్టం తెచ్చిపెట్టిందని, అయితే దేశ ప్రజల సంక్షేమాన్ని, వారి ప్రాణాలను లెక్కలోకి తీసుకుంటే ఇది మనం సాధించిన విజయమని ఆయన అన్నారు. మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.