తొలి వెలుగు యాంకర్ రఘును పోలీసులు అరెస్టు చేశారు. మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను నేడు అరెస్టు చేసి హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు పోలీసులు హాజరు పరిచారు.
దాంతో ఆయనకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. వెంటనే ఆయనను హుజూర్ నగర్ జైలుకు తరలించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు అత్యంత రహస్యంగా నిర్వహించారు.
నేటి ఉదయం 9 గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారు. నెంబర్ ప్లేట్ లేని జీపులో… తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లారు.
“కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే.. ఖబడ్దార్” అంటూ దుండగులు పెద్దపెట్టున కేకలు వేస్తూ జర్నలిస్ట్ రఘును బలవంతంగా జీపు ఎక్కించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ సంఘటనను సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్, బిజెపి నేతలు ‘హోల్ సేల్’గా అమ్మడుపోయారని, కుంభకోణాల గురించి నోరు మెదపటం లేదని ఆయన అన్నారు.
కోకాపేట కాందీశీకుల భూమి కుంభకోణం: 50వేల కోట్లు, ఐడిపిల్ భూ కుంభకోణం: 20 వేల కోట్లు, ఐకియా ముందు భూకుంభకోణం: 5 వేల కోట్లు…. ఈ కుంభకోణాలను ప్రశ్నించినందుకే రఘు అరెస్టు జరిగిందని ఆయన అన్నారు.
వేల కోట్ల దోపిడీని మనం మౌనంగా చూస్తూ ఊరుకుందామా..? అని పాశం యాదగిరి ప్రశ్నించారు. జర్నలిస్టును అరెస్టు చేయడానికి పోలీసులు అనుసరించిన వైఖరి కరెక్టు కాదని మానవహక్కుల సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.