ఓటరుగా నమోదైన వయోవృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ రాంబాబు, స్వీప్ నోడల్ అధికారి డిఆర్డీఓ మధుసూదన్ రాజు తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై ఐడిఓసి కార్యాలయంలో స్వీప్ కార్యక్రమాల్లో బాగంగా ఓటు హక్కు వినియోగంపై వయోవృద్ధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు వినియాగానికి వయోవృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.
వీల్ ఛైర్లు, ర్యాంపులతో పాటు వేచియుండకుండా తక్షణమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. మీతో పాటు మీ పిల్లలు, ఓటు హక్కు పొందిన మనుమలు, మనుమరాళ్ళతో కూడా ఓటు వేపించాలని చెప్పారు. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని నూరు శాతం పోలింగ్ ప్రక్రియకు సహకరించాలని చెప్పారు. నూతన ఓటర్లు నమోదుకు ఫామ్ -6, ఓటర్ కార్డు లో సవరణలు కొరకు ఫారం 8 లలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు.
ఓటర్ హెల్ప్ లైన్, ఎన్ వి ఎస్ పి యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు రచించిన ఓటరు చైతన్య గీతాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్వో శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, దివ్యాన్గుల నోడల్ అధికారి త్రినాధ్ బాబు, నోడల్ అధికారి స్వర్ణలత లేనీనా తదితరులు పాల్గొన్నారు.