కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన స్వప్న మునుగోడులో నామినేషన్ వేయడంతో పాటు అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేతో పాటు గ్రామాభివృద్ధి కమిటీపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషయమై బ్రాహ్మణపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదాం స్వప్న చిరంజీవి మునుగోడు నామినేషన్ వేసి తమపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. వ్యక్తిగత విషయాన్ని గ్రామానికి, ఎమ్మెల్యేకు ఆపాదించడం సరికాదన్నారు. గ్రామంలో ముదాం స్వప్న చిరంజీవి నిర్మించుకున్న ఇంటి స్థల వివాదంలో గ్రామస్థులు మాట్లాడటం జరిగిందని, రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టడంతో పాటు గ్రామంలోని కొందరిపై కత్తులతో దాడికి తెగబడ్డాడని పేర్కొన్నారు.
వారికి సంబందించిన షాపులో తేదీ అయిపోయిన వస్తువుల విక్రయం, పిల్లలకు ఫంగస్ సోకె వస్తువులను గుర్తించడం జరిగిందని, అందుకే ఆ దుకాణంలో ఎవరు వస్తువులు కొనవద్దని గ్రామంలో దండోరా వేయించడం జరిగిందన్నారు. వారిని గ్రామ బహిష్కరణ చేయడం అవాస్తవమని తెలిపారు.
గ్రామంలో అన్ని కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో జరిగిన వివాదం విషయం ఎమ్మెల్యేకు తెలియదన్నారు. అనవసరంగా ఎమ్మెల్యేను ఈ విషయంలోకి లాగుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో 2500 జనాభా ఉందని, అందులో ఎవరికి లేని సమస్య వీరికి మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాన్ని గ్రామానికి సంబందించిన సమస్యగా చిత్రీకరించి గ్రామాన్ని బద్నాం చేయడం సరికాదన్నారు. గ్రామంలో లేనిపోని సమస్యలు తెస్తూ వివాదాలు చేస్తున్నారని ఆరోపించారు.