తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గితే ఏపీలో పెరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతులు పూర్తిగా నాశనమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కోలుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.
మీడియాతో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఇష్టాగోష్టి మాట్లాడారు. సంపద సృష్టించే అమరావతిని జగన్ చంపేశారు. ఒకరి మూర్ఖత్వానికి, పిచ్చితనానికి రాష్ట్రం బలికావాలా? అమరావతిని రాజధానిగా ప్రకటించకముందు అక్కడ భూమి ధరెంత? రాజధానిగా కొనసాగి ఉంటే ఎంత ఉండేదో ఎవరైనా బేరీజు వేశారా? జీవనాడి పోలవరాన్ని ముంచేస్తే, ప్రజల్లో చైతన్యం ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు.
కృష్ణా-గోదావరితో రెండు రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకు నీళ్లివ్వొచ్చు దాని గురించి ఆలోచించకుండా భూ కబ్జాలు, సెటిల్ మెంట్లతో వేల కోట్లు దోచేశారని అన్నారు. మహిళా శక్తి అనేది ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. మినీ మేనిఫెస్టో మహాశక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యమిచ్చామని ఆయన తెలిపారు.
మహిళలకు వీలైనన్ని ఎక్కువ పథకాల కోసం ఆలోచిస్తున్నాం. మహిళలకు ఇప్పటివరకు 4 పథకాలే ప్రకటించాం. మహిళల భాగస్వామ్యంతో కుటుంబం, సమాజం బాగుపడేలా చూస్తాం. కట్టెల పొయ్యిపై మా అమ్మ పడిన కష్టాలు ఎన్నో చూశా. మా అమ్మ కష్టాలు చూసే ఆనాడు గ్యాస్ సిలెండర్లు తీసుకొచ్చాం.
పెరిగిన ధరలతో మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యేలా ఉన్నారు అని చంద్రబాబు అన్నారు. మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ విధానం వినూత్నమైంది. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యమే పీ4 విధానం.
పేదలకు ఇప్పుడు రోజుకు రూ.150 మాత్రమే వస్తోంది. సంపద సృష్టి ద్వారా పేదరికం పోగొట్టాలి. పూర్ టు రిచ్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కష్టమైన ఆచరణలో అద్భుత ఫలితం ఇస్తుంది అని చంద్రబాబు అన్నారు.