రాష్ట్రంలో కోనసీమ తర్వాత అంతటి కొబ్బరి సాగున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఏటా కొబ్బరి రైతులకు తెగుళ్లతో తీరని నష్టం వాటిల్లుతోందని, అందువల్ల కొబ్బరి బోర్డు అమలు చేస్తున్న ఆర్అండ్ఆర్ ప్రోగ్రాంను ఈ ప్రాంతానికి వర్తింప చేయాలని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ కోరారు. ఢిల్లీలో కొబ్బరి బోర్డు చైర్మన్ రాజాభీర్సింగ్ను ఆమె కలిశారు.
ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో కొబ్బరికి రోగాస్ తెల్లదోమ తెగులు సోకి తీవ్రంగా నష్ట పోతున్నారని, నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలోని ఉద్దానంతో పాటు తీర ప్రాంతం, ఎజెన్సీ మండలాల్లో కొబ్బరి, చెరకు, ఫైనాపిల్, బొప్పాయి, జీడి, అరటి, సముద్ర ఉత్పత్తులు ఫిష్, డెయిరీ ఉత్పత్తుల ఫుడ్ప్రాసెసింగ్కు అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మ నిర్భార్ భారత్ అభియాన్ పథకం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కోరారు. జిల్లాలోని వ్యవసాయ, హార్టికల్చర్ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు వీలుగా
కిసాన్ రైల్ సదుపాయం ఇచ్ఛాపురం వరకు పొడిగించాలని కోరారు. జిల్లాలో ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు పూర్తి సహకారం అందించాలని, అందులో భాగంగా జిల్లాలో వీలున్నంత తొందరలో పర్యటించి రైతుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందివ్వాలని కోరారు.