తెలంగాణ రాష్ట్రంపై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ద్వంద, తెలంగాణ వ్యతిరేక వైఖరిపై పోరాటాన్ని ఢిల్లీ వేదికంగా ఎంపీలు మరింత ఉధృతం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణపై అన్నిరకాల వివక్ష సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గత ఎనిమిది ఏళ్లుగా లేవనెత్తుతూనే ఉన్నామని గుర్తు చేశారు. 23 జిల్లాలో కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, ఎంపీలు వినతి పత్రం ఇచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 33 జిల్లాలు ఉంటే గతంలో ఇచ్చిన 9 మినహాయిస్తే కొత్తగా ఒక్క నవోదయ విద్యాలయాన్ని కూడా కేటాయించలేదని వివర్శించారు. అసోం లాంటి చిన్న రాష్ట్రానికి కూడా 27 నవోదయలు ఇచ్చారని వివరించారు. తెలంగాణ విద్యార్థులపై అక్కసుతో కేంద్రం పలు విద్యా సంస్థలు, కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం లేదన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు మరొక న్యాయం అన్న విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ పనితీరులో కేరళ తర్వాత రాష్ట్రంలో తెలంగాణ ఉందని చెప్పారు. ఇటీవల 80 నవోదయ విద్యాలయాలు కొత్తగా కేంద్రం మంజూరు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు రైతులు, నిరుద్యోగులు, ఎస్టీ రిజర్వేషన్స్, విభజన హామీలు, రాష్ట్రానికి నిధులు తదితర అంశాలపైన ప్రతి రోజు పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేశామన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నామని గుర్తు చేశారు. కానీ రాష్ట్రానికి కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన ఏ ఒక్కటి చేయటం లేదని మండిపడ్డారు. గత 8 సంవత్సరాల్లో దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 7 ఐఐఎం లు, 7 ఐఐటి, 2 ఐఐఎస్ఇఆర్, 16 ఐఐఐటి లు, 4 ఎన్ఐడి లు 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని, తెలంగాణకు ఒక్క నవోదయ విద్యాలయం కూడా చేయలేదని ఇది తెలంగాణ ప్రజల మీద, విద్యార్థుల మీద కేంద్రం పగ ఉందని అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.