అనంతపురం జిల్లాలో 12 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో సంవత్సరానికి సుమారు 1000 ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, జిల్లా వ్యాప్తంగా అగ్ని ప్రమాదాలను నివారిస్తూ ప్రజల ఆస్తులను కాపాడేందుకు తమ సిబ్బంది నిత్యం అప్రమత్తమై పని చేస్తున్నారని జిల్లా అగ్నిమాపక అధికారి శరత్ కుమార్ తెలిపారు.
స్థానిక అగ్నిమాపక కేంద్రంలో రానున్న వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు స్టోర్లో ఉన్న పరికరాలను పరిశీలించేందుకు కళ్యాణదుర్గం వచ్చిన సందర్భంగా మెట్రో టీవీ ప్రతినిధి లింగ ప్రసాదుతో మాట్లాడారు.
అనంతపురం జిల్లాలో 12 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా కళ్యాణదుర్గం లో మాత్రమే పక్కా భవనం లేదని స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్థల సేకరణ చేసి నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా అగ్నిమాపక అధికారి శరత్ కుమార్ తెలిపారు.
కళ్యాణదుర్గం ప్రాంతంలో రెవెన్యూ అధికారులు ఊరికి దూరంగా కొండగుట్టల మధ్య స్థలాన్ని కేటాయించారని, అయితే అది అనుకూలంగా లేకపోవడంతో మరో స్థలాన్ని కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు జరిగిన సందర్భం లో కూడా పని చేసేందుకు అవసరమైన రెస్క్యూ వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు నజీర్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.