నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు వచ్చే రైతన్నలకు, హమాలీలకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
నిజమాబాద్ జిల్లా మార్కెట్ యార్డు లో హమాలీ యూనియన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం కొనసాగుతున్న విధంగానే, మార్కెట్ యార్డులో సైతం ప్రారంభిస్తామన్నారు.
మార్కెట్ యార్డులో ఉచిత బోజన కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రదేశాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. రైతన్నలకు వెన్నుదన్నుగా ఉండే హమాలీ కార్మికులను అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్సి కవిత అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షపాతి అన్న ఎమ్మెల్సీ కవిత, కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లవేళలా సిద్దంగా ఉంటామని తెలిపారు. త్వరలో సొంత నిధులతో రైతులకు, హమాలీలకు మార్కెట్ యార్డులో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత కి రైతులు, హమాలీలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మేయర్ నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పోరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.