ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ నిర్ణయించారు. పార్టీ రహితంగా నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఆయన మంగళవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందని ఈ నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం తీసుకున్న పటిష్టమైన చర్యల వల్ల కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరమని ఆయన తెలిపారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలనిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదని అయితే నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని డాక్టర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.