కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను పెంచడమే కానీ తగ్గించింది లేదా అని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లీశ్వరి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేకసార్లు వంట గ్యాస్ ధరలు పెంచుతూనే ఉందని ధ్వజమెత్తారు. సామాన్యులు కనీసం కడుపు నింపుకోవడానికి వంట చేసుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. కరోనా వలన సామాన్యులు ఎటువంటి పనిలేక, ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షురాలు పశ్య పిచ్చమ్మ, పట్టణ అధ్యక్షురాలు దేవరం సుజాత, మహిళా సమాఖ్య సభ్యులు దేవరం అరుణ, పుల్లెంల ప్రవీణ, మునగ సామ్రాజ్యం, పాల గానీ వెంకటమ్మ, దేవరం పద్మ, కాల్వపల్లి దుర్గ, రామనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.