ఒకప్పుడు కళాబంధు గా వెలిగిపోయిన కాంగ్రెస్ నాయకుడు, కళాపోషకుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ దివాలా అంచున ఉంది. సుబ్బరామిరెడ్డి కుటుంబానికి గాయత్రి ప్రాజెక్ట్స్ అనే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నది. అయితే చాలా కాలంగా కంపెనీ ఆ రుణాలను తిరిగి చెల్లించడం లేదు.
బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు కెనరా బ్యాంక్ కన్సార్షియంలు అప్పులిచ్చిన వాటిలో ఉన్నాయి. ఇప్పటికే బ్యాంకులు తమ వద్ద తనఖా పెట్టిన షేర్లను నష్టానికి అమ్మేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఉన్న సుబ్బరామిరెడ్డి ఇటీవల వయసు పైబడిన కారణంగా అంత చురుగ్గా లేరు. విశాఖ, హైదరాబాద్లలో ఆడంబరంగా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయనను మించిన వారులేరు.
ఇటీవలి కాలంలో ఆయన జోరు తగ్గింది. ఇప్పుడు ఆయన కంపెనీ దివాలా అంచున చేరింది. కంపెనీ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. గతంలోనే ఈ అంశంపై జరపగా రుణ పునర్ వ్యవస్థీకరణకు గాయత్రీ గ్రూప్ అంగీకరించింది. కానీ చెల్లింపులు మాత్రం చేయలేదు. టీ సుబ్బరామి రెడ్డి ప్రమోట్ చేసిన ఈ కంపెనీలో ఆయన సతీమణి ఇందిరా రెడ్డి, కుమారుడు సందీప్కుమార్ రెడ్డి ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
దాదాపుగా ఆరు వేల కోట్లు ప్రస్తుతం ఆ బ్యాంకులకు నిరర్థక ఆస్తులుగా మారాయి. దివాలా ప్రక్రియ కొనసాగిస్తే గాయత్రీ ప్రాజెక్ట్స్ ఆస్తుల్ని బ్యాంకర్లు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకులు కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేశాయి. అయితే బ్యాంక్లు చేపట్టిన చర్యల్ని నిలుపుచేయాలంటూ తెలంగాణ హైకోర్టులో గాయత్రి ప్రాజెక్ట్స్ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.