విశాఖ శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సందర్శించారు. అక్కడి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు ఆయన అందుకున్నారు. అదే విధంగా సీఎం అక్కడ రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులతో కలిసి జగన్ జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశారు. సీఎం జగన్ శారదా పీఠం ప్రాంగణంలో గోమాతకు పూజలు చేశారు. అక్కడ స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతి చేపట్టింది. అందులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లోక కల్యాణార్థం విశాఖ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతికి కూడా సీఎం జగన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యులు ప్రశాంతిరెడ్డి, నాదెళ్ల సుబ్బారావు, శేఖర్ రెడ్డి ఉన్నారు.