తుదిశ్వాస వరకు నిబద్ధతకు, పట్టుదలకు కట్టుబడి పేదల అభ్యున్నతి కోసం కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన గిరిప్రసాద్
మచ్చలేని మహానేత అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దళ కమాండర్గా వీరోచిత పోరాటాన్ని నిర్వహించి పాల్వంచ ఏరియాలో వేలాది ఎకరాల భూమిని పంపిణీ
చేసిన మహోన్నతుడు గిరిప్రసాద్ అని తెలిపారు.గిరిప్రసాద్ 26వ వర్ధంతి సభ స్థానిక సిపిఐ కార్యాలయంలో మహ్మద్ సలాం అధ్యక్షతన జరిగింది. సభకు ముందు పాత బస్టాండ్ సమీపంలోని గిరిప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిప్రసాద్ విగ్రహం వద్ద సిపిఐ పతాకాన్ని జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఆవిష్కరించారు. సభలో హేమంతరావు మాట్లాడుతూ ఎగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన గిరిప్రసాద్ విద్యార్థి దశలోనే
సాయుధ పోరాటం పట్ల ఆకర్షితుడయ్యారన్నారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన గిరిప్రసాద్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా, ఖమ్మం శాసన సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేశారన్నారు.
స్పష్టమైన అవగాహన కలిగి పరిష్కార మార్గాన్ని చూపగలిగిన రాజకీయ నేతల్లో గిరిప్రసాద్ ఒకరని ఆయన తెలిపారు. 1980. దశకంలో గిరిప్రసాద్ రాష్ట్ర రాజకీయాల్లో చుక్కానిలా వెలుగొందారని హేమంతరావు తెలిపారు. మత రాజకీయాలను దాని ప్రమాదాన్ని ముందే పసిగట్టి మతోన్మాద ప్రమాదాన్ని ప్రజలకు వివరించే వారని ఆయన తెలిపారు. రాజకీయాల్లో
ధన ప్రభావాన్ని సైతం ముందే పసిగట్టి అందుకు సంబంధించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించే వారన్నారు. మతోన్మాదం ముంచుకొచ్చి దేశానికి ప్రమాదం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడడమే ఆయనకు మనమిచ్చే నివాళి అన్నారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా రాడేందుకు సంసిద్దులు కావాలని ఆయన కోరారు.