భారీ వర్షాల కారణంగా మళ్లీ గోదావరి స్థాయి పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నది. 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
వరద ప్రమాదపరిస్థితులను ఎదుర్కొనడానికి అధికారులను సన్నద్ధంగాఉంచాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. అందుకు సంబంధించి, తక్షణమే సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.