ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఇవ్వడం లేదని ఎంతో మంది రోగులు బాధపడుతుంటారు. ప్రభుత్వం ఆసుపత్రులపై ఆధారపడి వైద్యం కోసం వచ్చే పేద ప్రజలు ఎందరో ప్రభుత్వం ఇచ్చే మందుల కోసం ఎదురు చూస్తుంటారు.
అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడప జిల్లా పోరుమామిళ్ళలో మాత్రం ప్రభుత్వ డాక్టర్లు వేరే విధంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నది.
రోగులకు మందులు ఇవ్వకుండా దాచిపెట్టి వాటి గడువు తీరిన తర్వాత గుంత తీసి పాతిపెడుతున్నారు. దీంతో ప్రభుత్వ ధనం వృధా అవుతున్నది.
ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షలు విలువ చేసే మందులు బూడిదపాలవుతున్నాయి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలన అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు పంపిణీ చేయాల్సిన మందులు కాలం చెల్లిపోతున్నాయి.
ఇలా కాలం చెల్లిన మందులను గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది కాల్చివేస్తున్నారు. సిబ్బంది మందులను పంపిణీ చేయకుండా కాల్చివేయడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.