ఏపీ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ని ప్రభుత్వ వసతి గృహంలో పాము కాటుకు ఓ విద్యార్ధి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయనగరం తిరుమల హాస్పిటల్ కు విద్యార్థుల ను పరామర్శించేందుకు పలు పార్టీ నేతలు వస్తున్నారు. అందులో భాగంగా సీపీఐ, గిరిజన సంఘనేతలు తరలివచ్చారు.
ప్రభుత్వ పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలకి కారణమని సీపీఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మి అప్పలరాజు దొర, టి.జీవన్ లు ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు రక్షణ కోసం చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
ఈ మధ్య కాలంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం నియోజకవర్గ మైన కురుపాం హాస్టళ్ళలో విద్యార్థినీ విద్యార్థులు మరణాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరిగి విద్యార్థులు బలైపోతుంటే పాలకులు, అధికారులు మొసలి కన్నీరు కారుస్తున్నారే కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.
హాస్టళ్ళ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను పక్కదారి మళ్లించకుండా పూర్తిగా హాస్టళ్ళను అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులను రక్షించాలని సీపీఐ తరపున డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులు త్వరగా కోలుకునే విధంగా ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలని సీపీఐ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. మరణించిన విద్యార్థికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నేతలు పేర్కొన్నారు.