సంఘటిత రంగం లోని గ్రామీణ హమాలీలకు సమగ్ర వేతన చట్టం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని, వీరికి సంవత్సరంలో నాలుగు నెలలు కూడా పని దొరకడం లేదని , సూర్యాపేట జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షులు శీతల రోష పతి అన్నారు. ఇంకా కరోనాతో పని దొరకక ఇబ్బంది పడుతున్నారని, వారికి నెలకి రూ.7,500 చొప్పున 6 నెలలు ఇవ్వాలని ఆయన కోరారు.
హుజూర్ నగర్ మండలం లోని బూరుగడ్డ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పనిచేస్తున్న హమాలీల జనరల్ బాడీ సమావేశంలో రోషపతి పాల్గొని మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘం లో పని చేస్తున్న హమాలి కార్మికులకి పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఎరువుల బస్తాల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని, వీరికి ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా నందిగామ చిన్న రాములు, ఉపాధ్యక్షులుగా కందుకూరి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి దుర్గయ్య, సహాయ కార్యదర్శిగా చింత సైదులు, ఆర్గనైజర్ కార్యదర్శిగా కస్తాల వెంకన్న,కోశాధికారిగా చింత తిరుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇటీవల మరణించిన నల్గొండ జిల్లా సి ఐ టి యు సీనియర్ నాయకుడు మహ్మద్ బీన్ సయ్యద్ కుటుంబానికి సంతాపం తెలిపి మౌనం పాటించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.