వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె ’ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన నినాదంతో హరితహార కార్యక్రమంలో మంకీ ఫుడ్ కోర్ట్స్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మమాడ మండలం కొరిటికల్ గ్రామంలోని మంకీ ఫుడ్ కోర్టు లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన వానరాల బెడదను తప్పించేందుకు పండ్ల మొక్కలనుక పెంచుతున్నామని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా కోతుల కోసం మంకీ ఫుడ్ కోర్టుల్లో కోతులు ఇష్టంగా తినే పండ్ల చెట్లను పెంచుతున్నామని తెలిపారు. దీంతో కోతులకు సరిపడా ఆహరం దొరుకుతుందని గ్రామాల్లో, పట్టణాల్లో కోతుల సంచారం తగ్గుతుందని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అడవుల పునరుజ్జీనానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.
చెట్లు ఉంటేనే వర్షాలు సకాలంలో కురుస్తాయని, మనకు ప్రాణ వాయువునిచ్చే చెట్లు పెంచాలని కోరారు. మొక్కలను నాటడమే కాకుండా, వాటి సంరక్షించాలని సూచించారు. నాటిన మొక్కల్లో 85% మొక్కలను బతికించే భాద్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, డీఎఫ్ వో, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.