రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరకు 111 కోట్ల 91 లక్షల రూపాయలు తక్షణమే కేటాయించి నాణ్యతతో కూడిన పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఎమ్మెల్యే సీతక్కతో బాటు ఆలయ ప్రధాన పూజారులు సిద్ధ బోయిన జగ్గారావు, మంకిడి బుచ్చయ్య తదితరులు కూడా ఉన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల నుండి మేడారం జాతర అభివృద్ధికి సుమారు 112 కోట్ల తో ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.
అందుకోసం ఆ ప్రణాళిక ప్రకారం నిధులు మంజూరు చేయాలని ఆమె కోరారు. మేడారం జాతర పనుల పై దృష్టి సారించాలని, తక్షణమే అభివృద్ది పనులు చేపట్టాలని ఆమె కోరారు. కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.