బాలికపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘాతుకంపై రాష్ట్ర మహిళా-శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.
ఈ ఘాతుకంపై సూర్యాపేట జిల్లా ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా పెట్రోల్ పోసి నిప్పంటిచిన యువకుడు వెంకటేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలికలు, మహిళల పట్ల ఇట్లాంటి దారుణాలు జరగకుండా పోలీసు శాఖ మరింత అప్రమత్తంగా పనిచేయాలని, అవగాహనా చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళల పట్ల ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదని, ఇలాంటి సంఘటనలకు తావు లేదని, పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామని చెప్పారు.
మంటల్లో కాలి, గాయాలపాలై వరంగల్ ఎంజీఎం దవాఖానాలో చికిత్స పొందుతున్న బాలికకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని, ఆమె ఆరోగ్యం కోసం మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.