సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా విద్యాసంస్థలను రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలను సిద్దం చేసింది. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రణాళికలపై ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఉన్నత కార్యదర్శుల బృందం కీలక విషయాలను చర్చించారు.
ఈ నిర్ణయాన్ని కేంద్రం ఆగస్టు 31 తర్వాత చివరిదశ అన్లాక్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలకు వెల్లడించనుంది. అలాగే విద్యార్థులను క్లాసులకు పంపించాలా.? లేదా.? అనే అంశాలపై తుది నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్రాలకే వదిలేసింది. ఈ క్రమంలోనే పాఠశాలలకు, విద్యాసంస్థలకు బ్రాడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్స్(ఎస్ఓపి) జారీ చేయనుంది.
జూలైలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సమగ్ర సర్వేలోనూ ఈ ఎస్ఓపీలనే ప్రస్తావించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి అనుకూలంగా లేరని ఆ సర్వే సూచించినప్పటికీ, బలహీన వర్గాల విద్యార్థులు ఆర్థికంగా బాధపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి.
ఇక కరోనా కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు సీనియర్ తరగతుల విద్యార్ధులకు తిరిగి క్లాసులు ప్రారంభించాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో తేలింది. తరగతిలోని వివిధ సెక్షన్ల విద్యార్థులు పాఠశాలకు హాజరుకావడానికి నిర్దిష్ట రోజులు ప్రకటించనున్నారు.
అన్ని పాఠశాలలు షిఫ్టుల పద్దతిలో నడుస్తాయి. ఒక షిఫ్ట్ ఉదయం 8 నుండి 11 వరకు ఉంటే మరొకటి మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఇక మధ్యలో ఒక గంట శానిటైజేషన్ కోసం ఉంటుంది. బోధనా సిబ్బంది, విద్యార్థులు కలిపి 33 శాతం సామర్ధ్యంతో పాఠశాలలను నడపాలని సూచించారు.
అయితే కేంద్రం ఈ విధానాన్ని సిఫార్సు చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాల నుంచి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.