తెలంగాణ రాష్ట్రంలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మంగళవారం తెల్లవారుఝాము నుంచే భక్తులు అలయాలకు చేరుకొని ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. మరో వైపు రాజకీయ నేతలు కూడా ప్రత్యేక పూజలు చేశారు. గతానికి భిన్నంగా పార్టీల నేతలు ఉదయమే దేవాలయాలకు వచ్చి పూజలు చేశారు.
వుమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కాళేశ్వరం, వరంగల్ జిల్లాలోని వెయిస్తంభాల దేవాలయం, రామప్ప గుడులతో పాటు, ఖమ్మం జిల్లాలోని తీర్ధాల, లక్ష్మిపురం, నీలాద్రి తదితర దేవాలయాలలో భక్తులు వేలాదిగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, పిల్లలమర్రి, వాడపల్లి, మెళ్ళచెరువు శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
అయితే పార్టీల నేతలు మాత్రం ప్రత్యేక పూజల పేరుతో దేవాలయాల వద్దనే యెక్కువసేపు గడపడంతో అనేక మంది ఎన్నికలు ఏమైనా వున్నాయా అని చర్చించుకోవడం విశేషం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ నగరం లోని వేయిస్తంభాల దేవాలయంలో ప్రభుత్వ విప్ వినయభాస్కర్ , ఖమ్మం జిల్లా కల్లూరు లో ఎంఎల్ఏ వెంకట వీరయ్య, కూసుమంచి శివాలయంలో పాలేరు ఎంఎఏ కందాల ఊపేందర్రెడ్డి, ఎంఎల్సి తాత మధు తదితరులు పూజలు చేశారు.