ఏపిలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సరైన ఆలోచనా విధానం లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైందని భారతీయ జనతా పార్టీ నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఏపీ ప్రజల నెత్తిన రూ.5లక్ష కోట్ల అప్పు భారం ఉందని, దీన్నిఎలా తీరుస్తారు? అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. అప్పు తెచ్చి పంచడమే ప్రభుత్వం పనిగా ఉందని ఎద్దేవా చేశారు. విజయవాడ బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల నెత్తిన ఇప్పుడు సుమారు రూ.5లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ఇంకా ఎంతకాలం అప్పు పుడుతుందో ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు. అప్పులను ఎలా తీరుస్తారో.. దీనికి కార్యాచరణ ప్రణాళిక ఏముందో స్పష్టం చేయాలని ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు.