సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ ప్రధాన కేంద్రం లో భారీ స్థాయిలో గుంతలు ఏర్పడి అనేక రోజులు గడుస్తున్నా మున్సిపాలిటీ అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదు. దాంతో ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ప్రధాన రహదారిలో ఏర్పడిన భారీ గుంటలలో చేపలు పడుతూ ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి అజీజ్ పాషా మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాల క్రితం వేసిన వాటర్ పైపు లైన్లు నేడు శిథిలావస్థకు చేరి తరచుగా లీకౌతూ ప్రధాన రహదారిపై గుంటలు ఏర్పడుతున్నాయని అన్నారు. పిఎస్ సెంటర్ నుండి శాంతి స్తూపం, కోదాడ, మిర్యాలగూడ ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయని అన్నారు.
చుట్టుప్రక్కల సిమెంట్ ఫ్యాక్టరీల భారీ వాహనాలు వెళుతుండటం వల్ల గుంటలు మరింతగా పెరిగి పెద్దవై ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు వాటర్ పైప్ లైన్ మార్చాలని మున్సిపాలిటీ అధికార నాయకులను కోరామని, అయినా వారు పట్టించుకోవడం లేదని అన్నారు.
మునిసిపాలిటీకి అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చిందని, ఆ ఫండుతో నూతల పైపులైన్లు వేయాలని, అందుకోసం ప్రతిపాదనలు తయారు చేసి నూతన రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యుడు సుతారి వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఇంకా,ముశం సత్యనారాయణ, జక్కుల మల్లయ్య, కోల మట్టయ్య, పాశం రామరాజు, దొంతగాని జగన్, వినయ్, సైదులు, రంగా, రవి, ప్రవీణ్, నాగేశ్వరరావు, తదితరులు కూడా పాల్గొన్నారు.