సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్రెడ్డి ని నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి జవహర్ రెడ్డి అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీకి బదిలీ చేసిన తర్వాత నుంచి జవహర్ రెడ్డి ఆ స్థానంలోకి వస్తున్నారనే ఊహాగానాలు వ్యాపించాయి. అదే విధంగా జరగడంతో ఎవరూ పెద్దగా ఆశ్చర్య పోవడం లేదు. అదే విధంగా కె.ఎస్.జవహర్రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా కూడా కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నియామకంతో బాటు మరి కొందరు సీనియర్ ఐఏఎస్ లకు కూడా స్థానచలనం కలిగింది. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్కుమార్ ప్రసాద్ ను నియమించారు. సీసీఎల్ఏగా జి.సాయిప్రసాద్ ను, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయ్కుమార్ ను నియమించారు. రవాణాశాఖ కమిషనర్గా ఎం.టి.కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్కుమార్ ను నియమించగా క్రీడలు, యువజనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాబు.ఎకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి అక్కడ నుంచి ఐపీఎస్ అధికారి పి.సీతారామాంజనేయులుకు ఏపీపీఎస్సీ కార్యదర్శి నుంచి రిలీవ్ చేశారు.