కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని పిసిసి చీఫ్ ,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్ర ఆసుపత్రి, జిల్లా జైలు ను సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తండు సైదులు గౌడ్ ను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కరోనా కట్టడి లో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. రాష్ట్రంలో లో నాలుగు నెలల నుంచి కరోనా విస్తరిస్తున్న ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు లేవు
ప్రభుత్వ ఆస్పత్రులు సరైన వసతులు లేక కరోనా చికిత్స కోసం వచ్చిన పేదలకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. ఆస్పత్రిలో సరైన వెంటిలేటర్స్, బెడ్స్, ఆక్సిజన్ కూడా లేకపోవడం శోచనీయమన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సరైన వైద్యం అందక యువకుడు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. నిజామాబాద్, హైదరాబాదులోని ఫీవర్ హాస్పిటల్ లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ప్రభుత్వం మేల్కొనకపోతే సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనా చికిత్సకు సంబంధించి సరైన వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా తో మరణించిన వారికి 10 లక్షలు పరిహారం ఇవ్వాలి
కరోనాతో మృతి చెందిన సామాన్య ప్రజలకు పది లక్షలు చెల్లించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ముందుండి పోరాడుతున్న సిబ్బందికి 50 శాతం అదనపు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజారోగ్య సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, జర్నలిస్టులకు ఎక్స్ గ్రేషియా 50 లక్షల చెల్లించాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ చికిత్సకు సంబంధించి వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సూపరిండెంట్ ను కలిసి వైద్యం అందక మృతి చెందిన యువకుడు సంఘటనకు సంబంధించి సూపరిండెంట్ నరసింహ కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నిధులు లేకపోతే నేను ఇస్తాను
ఆస్పత్రిలో వసతులకు సంబంధించి తన ఎంపీలాడ్స్ నుంచి నిధులను కేటాయిస్తానని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సూపరిండెంట్ కు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, టీ పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత,జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య పాల్గొన్నారు.
ఇంకా, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ ఎంపీపీ జిల్లాపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెఱిక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసిలు, సర్పంచ్ లు, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.