రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితిని మూడేండ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో రాష్ట్రం లోని అన్ని మార్కెట్ కమిటీ పాలక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కమిటీ ఏడాది కి మాత్రమే వుండేది. దీంతో కమిటీ సభ్యులు తమ పదవీ కాలం పెంచాలని ప్రభుత్వ పెద్దలను కోరిన సందర్భాలు అనేకం వున్నాయి. ప్రభుత్వం కమిటీ ల కాలపరిమితిని పెంచేందుకు అనేక సార్లు చర్చించి చట్ట సవరణ ద్వారా కమిటీల కాలపరిమితిని మూడేండ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ చట్ట సవరణ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో సీఎం కేసిఆర్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ల చిత్రపటాలకు మార్కెట్ ఛైర్మన్ డౌలే లక్ష్మి ప్రసన్న అధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.
మార్కెట్ కమిటీ కాలపరిమితిని మూడేండ్లకు పెంచడం పట్ల వారు సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాణసంచా కాల్చి, మిఠాయి పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సభ్యులు, తెరాస నాయకులు, తదితరులు ఉన్నారు.