ఇంద్రవెల్లి గాయానికి 39 ఏళ్లు నిండాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని 1991 ఏప్రిల్ 20 ఆదివాసీల కోసం జరిగిన పోరాటంపై పోలీసులు మోపిన ఉక్కుపాదం ఎంతో మంది ప్రాణాలు తీసింది. దేశంలోనే అతి పెద్ద ఎన్ కౌంటర్ గా చరిత్రలో నిలిచిపోయిన ఇంద్రవెల్లి ఇంకా ఏడుస్తూనే ఉంది.
భూమి కోసం భుక్తి కోసం ఆనాడు జరిపిన పోరాటంలో ఎందరో అసువులు బాసారు కానీ వారి న్యాయమైన డిమాండ్లు ఇప్పటికీ నెరవేరలేదు. ఇంద్రవెల్లి ఘటన జరిగి నేటికి 39 ఏళ్లు. భూమికోసం భుక్తి కోసం సాగు భూముల హక్కులకోసం జరిగిన పోరాటం అది.
ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్న భూములకు హక్కులు కల్పించడానికి ఆదివాసి గిరిజనులంతా సంఘటితం కావడానికి ఆనాడు నిర్ణయించారు. ఆ రోజు సోమవారం, అక్కడ సంత జరిగే రోజు. ఆదివాసీ గిరిజనుల అడుగులు ఇంద్రవెల్లి వైపు సాగాయి. ఆ సమయంలో జరిగిన ఒక ఘటన పోలీసు కాల్పులకు దారి తీసింది.
అమాయక గిరిజనులకు తూటాలు తూట్లు పొడిచాయి. ఎందరో అమాయక గిరిజనులు క్షతగాత్రులు కాగా కొంతమంది తూటాలకు బలయ్యారు. ఆనాటి నుంచి నేటి వరకు ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవం వచ్చిందంటే ఆదివాసీల అంతా ఏప్రిల్ 20న జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ మౌనంగా రోదిస్తుంటారు.
నాటి ఘటన లో అమరులైన కుటుంబాల ఆదివాసీలు వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఈ ఏడాది ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభకు ఉమ్మడి జిల్లాలోని 50000 మందితో నివాళులర్పిస్తారని ఎంపీ సోయం బాబూరావు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గత ఏడాదే ప్రకటించారు.
ఈ ఏడాది సంస్కరణ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదివాసీలు నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా కారణంగా వేడుకలకు అడ్డుకట్ట పడినట్లయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా సంస్కరణ సభ కొంత మందితో నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు.
39వ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఆదివాసి గ్రామాలలో ఇంటింటా నిర్వహించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని నాయకులు గ్రామాలకు సమాచారం అందించారు.