ఉత్తర ఆంధ్ర రూపురేఖలు మార్చడానికి మా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తుందనటానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక నిదర్శనం అని సీఎం జగన్ అన్నారు. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురంలో ఆయన శంకుస్ధాపన చేసారు. రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్పార్క్ లిమిటెడ్ (అదానీ గ్రూప్), 194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులకు విజయనగరం జిల్లాలో రూ. 23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు కూడా సీఎం జగన్ శంకుస్ధాపన చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం…!
4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా దీని సామర్ధ్యాన్ని పెంచి విస్తరించనున్నారు.
21,844 కోట్లతో వైజాగ్ టెక్పార్క్ లిమిటెడ్ (అదానీ గ్రూప్)
అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ & బిజినెస్ పార్క్ ఏర్పాటు, త్వరలో రూ. 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ & బిజినెస్ పార్క్ల అభివృద్ది, తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, 10,610 మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది.
తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్టు…!
విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు త్రాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీరుతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్కు అవసరమైన నీరు అందించడమే లక్ష్యంగా రూ. 194.40 కోట్ల వ్యయంతో తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులు, డిసెంబర్ 2024 నాటికి పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
చింతపల్లి ఫిష్ల్యాండింగ్ సెంటర్…!
విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో 23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం చేయనున్నారు. అన్ని కాలాల్లో సముద్రంలో సులువుగా చేపలను వేటాడేందుకు వెసులుబాటు, తుఫాను, విపత్తు సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బతినకుండా లంగర్ వేసే సదుపాయాలను కల్పించనున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఈ నిర్మాణం వల్ల మత్స్యకారుల ఆదాయం పెరనుంది.
భోగాపురం ఎయిర్పోర్టు విశేషాలు….!
ప్రధానంగా భూసేకరణ, టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఎన్వోసీ, పర్మిషన్లు తీసుకొచ్చి ఎన్జీటీ, హైకోర్టు, సుప్రింకోర్టులలో న్యాయవివాదాలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సమస్యలన్నీ తొలగిపోవడంతో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించటానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది.పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్ గ్రూపుతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడిసీఎల్) ఒప్పందం చేసుకుంది.
దీనిలో భాగంగా ప్రయాణీకుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం చేయనుంది. ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్కు చేరుకునే విధంగా రహదారులను అనుసంధానం చేయనున్నారు. అలాగే అంతర్జాతీయ ఎగ్జిమ్ గేట్వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్, తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్వే, కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్ వంటివి అభివృద్ది చేయనున్నారు.
16 వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ వంటి సౌకర్యాలను కల్పించనున్నారు.విశాఖపట్నం–భోగాపురం మధ్య 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లైన్ల రహదారి నిర్మాణం చేసి దీనికి రెండువైపులా సర్వీసు రోడ్లులను నిర్మించనున్నారు.ఎయిర్పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి కలగనుంది.
ఎయిర్పోర్టు నిర్వాసితులకు పునరావాసం…!
విమానాశ్రయం కోసం స్వఛ్చందంగా ఇళ్ళను ఖాళీ చేసిన 4 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ. 77 కోట్లతో పునరావాసం కల్పించి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇళ్ళ నిర్మాణం పూర్తిచేసి వసతి కల్పించడం కూడా ఇప్పటికే జరిగింది.
అదానీ డేటా సెంటర్…!
డేటా హబ్తో గణనీయంగా పెరగనున్న డేటా స్పీడ్, సింగపూర్ నుండి విశాఖపట్నం వరకు సముద్ర సబ్ మెరైన్ కేబుల్ ఏర్పాటు, తద్వారా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ 5 రెట్లు పెరిగి భవిష్యత్లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్ధలు ఏర్పాటు చేసేందుకు అవకాశం కలగనుంది. విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల వృద్ది, భారీ స్ధాయిలో హైటెక్ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం, విశ్వసనీయమైన డేటా భద్రత, సేవల ఖర్చులలో తగ్గుదల కలగనుంది. అధునాతన టెక్ కంపెనీలు విశాఖపట్నంను ఎంచుకునే వీలు, తద్వారా ఐటీ రంగంలో ఆర్ధిక కార్యకలాపాలు పెరకానున్నాయి. డేటా సెంటర్కు అనుంబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్శిటీ, స్కిల్ సెంటర్ల ద్వారా యువతలో నైపుణ్యాల పెంపుకు మరింత ఊతం కలిగి, బిజినెస్ పార్క్ రిక్రియేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగుల జీవన శైలి మారనుంది.
మారనున్న ఉత్తరాంధ్ర ముఖ చిత్రం…!
భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసిన అనంతరం.. విజయనగరం జిల్లా సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి అయితే ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మరనుందని ఉత్తరాంధ్ర ప్రజలనుద్దేశించి అన్నారు.అలాగే ఈ సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతుందని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం.
ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారనుంది. చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను ప్రారంభించాం. అదానీ డేట సెంటర్ట్ తో ఉత్తరాంధ్ర ఐటీ రంగంలో కీలకంగా మారుతుంది. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడు. ఎయిర్పోర్టు తీసుకురావడానికి చిత్తశుద్ధితో పని చేశామన్నారు.
అంతేకాకుండా కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశామని గత వారు చెప్పుకున్నారని ప్రజలకు గుర్తు చేశారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారు. 2026 నాటికి రెండు రన్వేలతో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుందన్నారు. మొదటి ఫేజ్లో 60 లక్షల జనాభాకు సదుపాయాలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి 4కోట్ల ప్రజలకు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
ఏ380 డబుల్ డెక్కర్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఏర్పాట్లు చేస్తాం. ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం గుర్తొస్తుంది. అందుకే ఉత్తరాంధ్రలోని కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టాం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేసమన్నారు. అన్ని ప్రాంతాలు బాగాపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం, అందుకే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో జాబ్ హబ్ గా మారుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారుతుందని సీఎం ఆకాంక్షించారు. ఇవాళే అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయబోతున్నాం. డేటా సెంటర్ ఏపీ ముఖచిత్రమే మారబోతోందని సీఎం జగన్ ప్రజలకు తెలిపారు.