శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ .డి. వి. ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగు తల్లి, గిడుగు వేంకట రామమూర్తి పంతులు గార్ల చిత్ర పటాలుకు పూలమాలలతో సత్కరించారు. అనంతరం తెలుగుభాషో పాధ్యాయులు పిసిని వసంతరావు మాట్లాడుతూ యునెస్కో 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించిందని ,2000 నుండి ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తుందని, భావవ్యక్తీకరణకు భావ ప్రకటనకు మాతృభాష ఎంతో దోహదం చేస్తుందని అన్నారు.
ప్రతి విద్యార్థి మాతృభాష పై పట్టు సాధిస్తే ఇతర భాషలను కూడా అవలీలగా నేర్చుకోవచ్చని ప్రాథమిక దశ నుండే మాతృభాషపై మమకారం పెంచుకోవాలని తెలిపారు. మరొక తెలుగు భాషో పాధ్యాయులు గొర్లే భూషణరావు మాట్లాడుతూ విషయ అవగాహనకు మాతృభాష సహాయకారిగా ఉంటుందని తల్లి శిశువును సంరక్షించినట్లే మాతృభాష కూడా మానవుని సంరక్షిస్తుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మాతృభాష ప్రాధాన్యత పై ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు.
అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది తెలుగు భాషోపాధ్యాయులు పిసిని వసంతరావు, గొర్లే భూషణరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కరణం శ్రీహరి, బలివాడ ప్రభాకరరావు, బుడుమూరు అప్పలనాయుడు, బెండి శారద, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, పొన్నాన ఉషారాణి,కింతలి ప్రసూన, మోర అనిత, తంగి పద్మావతి,పంచి రెడ్డి మోహనరావు, సంపతి రావు రమణమ్మ, బొంగు వెంకటరమణమూర్తి విద్యార్థులు పాల్గొన్నారు.