జమ్మూ కాశ్మీర్ లో ఇంకా సోషల్ మీడియా పై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్ననాయి. తాజాగా సోషల్ మీడియా పై ఉన్న ఆంక్షలను ఫిబ్రవరి 24 వరకు కేంద్ర పాలిత ప్రాంతం అంతటా పొడిగించారు. 2జీ మొబైల్ డేటా సర్వీసు, ల్యాండ్ లైన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పై ఆంక్షలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP) 1,485 వైట్ లైన్ డ్ సైట్లను మాత్రమే యాక్సెస్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. పీర్-టు-పీర్ కమ్యూనికేషన్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN) అనువర్తనాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. వీటి నుంచే సోషల్ మీడియా ఆపరేట్ అవుతున్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత నుంచి అంటే గత ఏడాది ఆగస్టు 5 నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్ నెట్ సేవలను రద్దు చేశారు. తరువాత జనవరి 25 న మొబైల్ ఫోన్లలో 2జి ఇంటర్నెట్ సదుపాయాన్ని పునరుద్ధరించారు. రెచ్చగొట్టే మెటీరియల్ ను కొందరు ఇంకా అప్ లోడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని పోలీసు ఇంటెలిజెన్సు వర్గాలు చెబుతున్నాయి. గత వారంలో సాధారణ ప్రజానీకాన్ని రెచ్చగొట్టే పుకార్లు వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడి కావడంతో పరిమిత కాలం పాటు మొబైల్ డేటా సేవల తాత్కాలిక సస్పెన్షన్ ను తప్పనిసరి చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారు మెబైల్ కమ్యూనికేషన్ యథావిధిగా వాడుకోవచ్చు.