ఆంక్షలు విధించినా, ‘మిస్ యూనివర్స్-2021’ పోటీలు జరిపి తీరుతామని ఇజ్రాయెల్ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 12న ఐలాట్లోని రెడ్ సీ రిసార్ట్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ అందాల పోటీలో పాల్గొనే అందరికీ ప్రతి 48 గంటలకు పీసీఆర్ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని, అలాగే వైరస్కు సంబంధించి ఇతర భద్రతా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
దాదాపుగా 174 దేశాల్లో ఈ అంతర్జాతీయ ఈవెంట్ ప్రసారం అవుతుందని, అర్ధాంతరంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేమని స్పష్టం చేసింది. కాగా మలావి నుంచి వచ్చిన ఓ మహిళా టూరిస్ట్ కు ఓమిక్రాన్ వైరస్ సోకిందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో విదేశీయులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది.
దేశంలో 14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్- ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్లో ఉన్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ఇజ్రాయెల్ దేశస్తులు కూడా క్వారంటైన్లో ఉండాలని, ఇంతకుముందు మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరవాలని ఆదేశాలు జారీ చేసింది.