రాష్ట్రంలో వైసీపీ, బిజెపిలు కలిసి పని చేస్తున్నాయని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. మరీ ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్న విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదని ఆయన అన్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జగన్ సహ నిందితురాలైన విశ్రాంత ఐఏఎస్ అధికారి రత్నప్రభకు బిజెపి టిక్కెట్ ఇవ్వడమే ఇందుకు సాక్ష్యమని ఆయన తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాలు, దేవుడి విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్న బిజెపి ఆయనతోనే చేతులుకలపడం పచ్చి అవకాశవాద రాజకీయమని సుధాకర్ రెడ్డి అన్నారు. అలాగే జగన్ రెడ్డి కుల మత తత్వాలను రెచ్చగొట్టి లాభ పడుతున్నారని ఆయన ఆరోపించారు.
తిరుపతిలో సక్రమంగా ఎన్నికలు జరిగితే టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు ఖాయమని గ్రహించిన జగన్ బిజెపి అభ్యర్థి ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని సుధాకర్ రెడ్డి అన్నారు. తాత చస్తే బొంత నాదన్న చందంగా తెలుగు దేశం ఓడిపోతే రాష్ట్రంలో బిజేపి ప్రత్యామ్నాయం పార్టీగా ఎదగచ్చని భ్రమ పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
40 శాతం ఓట్లు సాధించిన టిడిపికి ఒక శాతం ఓట్లు వున్న బిజెపి ఎప్పటికి ప్రతామ్నాయం కాదని గుర్తించాలని ఆయన అన్నారు. బిజెపి అభ్యర్థి రత్నప్రభ ఎన్నికల ఖర్చులకు జగనే డబ్బు పంపుతన్నారన్నది జగమెరిగిన సత్యం అని ఆయన ఆరోపించారు. బిజెపి రాష్ట్ర నాయకులు ఇప్పటికైనా నిజాలు గ్రహించి కుయుక్తులు మానుకుంటే పరువు దక్కుతుంది.
జగన్ లు కలిసి పనిచేస్తున్నారని చెప్పడానికి మరి కొన్ని విషయాలు కష్టమైనా చెప్పక తప్పదు. హిందువుల పార్టీగా చెప్పుకునే బిజెపి క్రిష్టియన్ ను తమ అభ్యర్ధిగా ఎందుకు పెట్టింది? అనే దానికి సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి చెబితేనే క్రిష్టియన్ ను తమ అభ్యర్ధిగా పెట్టుకున్న బిజెపి నీతులు చెబితే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి నుంచి నెలవారీ బత్తాలు, జీతాలు, కార్లు తీసుకునే బిజెపి నాయకుల మాయమాటలు ప్రజలు తిరస్కరించాలని సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.