నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కుటుంబం మొత్తానికి బీమా వర్తించి నవ్యాంధ్రప్రదేశ్ లోని నిరుపేదలు అందరూ ధీమాగా ఉండేవారని నేడు జగన్ సర్కార్ లో వైఎస్ఆర్ ప్రమాద బీమా పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తించడంతో పేద కుటుంబాల్లో ధీమా కనిపించడం లేదని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ధ్వజమెత్తారు.
నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రన్న భీమా ద్వారా సహజ మరణానికి రెండు లక్షలు పొందితే నేడు వైఎస్సార్ బీమా లక్ష రూపాయలకే పరిమితం చేయడం, చంద్రన్న బీమా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కేవలం 15 రోజులలో అందిస్తే నేడు 45 రోజులకు అందిస్తూ… అది కూడా పూర్తిగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు.
వైఎస్ఆర్ బీమా రూ. 750 కోట్లతో 1.32 కోట్ల లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది కేవలం 62 లక్షల మందికే పరిమితం అవుతుందని కానీ ఆనాడు చంద్రన్న బీమా 2.47 కోట్ల మందికి వర్తించి పేదలను పూర్తిగా ఆదుకుంటుందని ఆయన వివరించారు.
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రన్న బీమా కింద 4007 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల కేవలం 4 కోట్లు ఖర్చు చేసిందని నాడు చంద్రన్న బీమా కింద అంత్యక్రియలకు 30,000/- అందిస్తే నేడు అ ఊసే లేదని ఆయన అన్నారు.
పేదల్ని నమ్మించి వంచించినడమే కాక పేదలకు బీమా లేకుండా చేస్తూ తామేదో సాధించామని గురువారం వైఎస్సార్ ప్రమాద బీమా ను ఆర్భాటంగా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించడమే కాక వైయస్సార్ బీమా పేదలకు కుటుంబాలకు ఎనలేనిదని పత్రికా ప్రకటనలకు కోట్లాది రూపాయలు తగలేయడం పై ఆయన మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భీమా కొనసాగించని కారణంగా,అసమర్థత కారణంగా 2020 ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు చనిపోయిన ఏ ఒక్కరికి వైఎస్ఆర్ బీమా వర్తించలేదని అందువలన వేలాది మంది పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని,దీని పై ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుని వారందరికీ భీమా అందేలా చర్యలు తీసుకోవాలని,లేకుంటే పేద ప్రజల దృష్టిలో చరిత్రహీనులు కాక తప్పదని చదలవాడ హెచ్చరించారు.