ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి వెల్లడించారు. ఈ నాలుగేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి.. వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఇంకేమైనా అవసరాలను తీర్చాల్సి ఉందా? అన్న విషయాలను కూడా గుర్తిస్తామని తెలిపారు.
బుధవారం విజయనగరంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ 14 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ తరఫున నియమతులైన గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు ఇందులో భాగస్వామ్యం అవుతారని వివరించారు.
గత ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, ఇతర కనీస అవసరాలు తీర్చేందుకు ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాల కోసం కొంత మొత్తాన్ని వెచ్చిస్తుందని చెప్పారు. ఆనాడు దివంగత వైఎస్, చంద్రబాబు హయంలోనూ ఇవి జరిగాయని, జగన్ ప్రభుత్వం ఒక్కటే కొత్తగా పెట్టినదేమీ కాదని తెలిపారు. నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే లబ్ధిని అందజేస్తున్నామని గుర్తు చేశారు.
ప్రభుత్వంపై పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ నాయకులు.. రాష్ట్రం దివాలా తీస్తోందని, శ్రీలంక మాదిరి అయిపోతుందని వారి అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేస్తూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, లంచగొండితనాన్ని అదుపు చేశామని, మౌలిక సదుపాయాలు కల్పించామని.. అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామని చెప్పారు.
ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పారని కోలగట్ల అన్నారు. ఇప్పుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళలేక పొత్తుల కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఎవరు కలిసినా జగన్ ను ఓడించలేరన్న భయంతోనే తమ అనుకూల మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి వర్గానికీ మేలు జరుగుతోందని, ప్రతిపక్షాల మాటలను నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సామాన్యుల సాధికారికత కోసం.. జనాభాలో సగమైన అక్కాచెల్లెమ్మలకు సముచిత స్థానానికి.. విద్య,వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమున్నత అభివృద్ధికి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని… గ్లోబల్ ప్రచారంతో ఓడించగలమని భావిస్తే.. అది వారి అవివేకం, అత్యాశే అవుతుందని అన్నారు.
నగర సుందరీకరణలో భాగంగా విజయనగరంలోని ఐస్ ఫ్యాక్టరీ కూడలి వద్ద ఉప్పు సత్యాగ్రహం సందర్భాన్ని గుర్తు చేస్తూ.. ఏర్పాటుచేసిన దండి మార్చ్ విగ్రహాలను గురువారం ఆవిష్కరించనట్లు కోలగట్ల తెలిపారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదగా జరగనున్న ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.