కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక మండపాలు పెట్టుకోవటానికి అనుమతులు ఇవ్వమని అడిగితే తమకు మతాన్ని అంటగట్టి మాట్లాడతారా? అని నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
వినాయక మండపాలు పెట్టుకోవటానికి అనుమతులు ఇవ్వాలని కోరిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వచ్చేది పండుగల కాలం, కాబట్టి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అవసరమైన మేరకు మాత్రమే చర్యలు తీసుకోండి అని కేంద్రం చెబితే, హిందూ ధర్మాన్ని పూర్తిగా అణచివేయాలనే ధోరణితో పాలన సాగిస్తున్న మీరు ఏకంగా మండపాలనే పెట్టుకోవద్దు, ఇళ్ళలోనే పండుగ చేసుకోండి, ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని అదేశాలివ్వడమే కాకుండా, కేంద్రం ఆదేశాలని అసత్యాలుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
హిందూ ధర్మంపై మీరు చూపిస్తున్న వివక్షను రాష్ట్రంలోని హిందువులంతా గమనిస్తున్నారు. విఘ్ననాయకుడికే విఘ్నాలు కలిగిస్తున్న మీకు,త్వరలో ఆ వినాయకుడే యావత్ హిందూ సమాజం ద్వారా బుద్ధి చెబుతాడు అని ఆయన కామెంట్ చేశారు. ఒక్కో మతానికి సంబంధించిన పండుగలకు ఒక్కో రకమైన అదేశాలిస్తూ, మతాల మధ్యన చిచ్చు పెట్టేది మీరు,మీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు.