రాష్ట్రంలో ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం జగన్ సర్కార్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యమంత్రి ఇసుక తవ్వకాల ద్వారా నాలుగేళ్లలో 40 వేల కోట్లు లూటీ చేశారని టీడీపీ నాయకుల ఆరోపణ. వైసీపీ పెద్దలు ఇసుకను వాటాలేసుకొని దోచుకొంటున్నారని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. టిడిపి హయాంలో ఉచిత ఇసుక విధానాన్ని తీవ్రంగా విమర్శించిన వైస్ జగన్ మోహన్ రెడ్డి… వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే శాండ్ మొత్తం సొంత కంపెనీలకే కేటాయించుకున్నారనేది ప్రతిపక్షాల వాదన.
గతం కంటే మెరుగైన విధానం తెస్తాం… ఇసుకను డోర్ డెలివరీ చేస్తామని చెప్పి… 40 లక్షల భవన నిర్మాణ కార్మికులను తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టారని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. జగన్ తీసుకొచ్చిన లోపభూయిష్టమైన ఇసుక విధానం కారణంగా 130 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని… ఇసుక మాఫియా ఆగడాలతో ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
శాండ్ మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్లు, మండల కార్యాలయాల దగ్గర సత్యాగ్రహ దీక్షలతో హోరెత్తిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతం అయ్యే వరకు పోరాటాలు కొనసాగిస్తామని శపథం చేస్తున్నారు. వైసీపీ ఇసుక దోపిడీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మైనింగ్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు టీడీపీ నాయకులు.
అక్రమ ఇసుక తవ్వకాలు, శాండ్ మైనింగ్ దోపిడీలపై సమాధానం చెప్పలేని ప్రభుత్వం.. సత్యాగ్రహం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు నాయకులను అడ్డుకొనేందుకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయం ఉన్న విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ముఖ్యనాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో అడ్డూ, అదుపు లేని ఇసుక తవ్వకాలతో పర్యావరణం ధ్వంసమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఎంత మంది పోలీసులను దించినా.. ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు ఆపేదే లేదని స్పష్టం చేస్తున్నారు.
టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు సైతం జగన్ సర్కారు ఇసుక దోపిడీపై గళమెత్తుతున్నారు. ఇల్లీగల్ మైనింగ్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతమైన, ఇసుక తుఫానులా మారి, తాడేపల్లి ప్యాలెస్లో అలజడి సృష్టించడం ఖాయమనే అభిప్రాయం ఉంది.