బంధువును అడ్డంపెట్టుకుని తిరుపతిలో అక్రమ వ్యాపారాలు చేసే మాజీ మంత్రి సి. రామచంద్రయ్య బిజెపి జనసేన కలయికపై విమర్శలు చేయడం శోచనీయమని తిరుపతి జనసేన నాయకులు అన్నారు. జనసేన నాయకులు రాజారెడ్డి, సుభాషిణి, బాబ్జి, మనోజ్, బాలు, మునుస్వామి నేడు మీడియాతో మాట్లాడుతూ ముందు తిరుపతిలో అక్రమ వ్యాపారాలు నిలిపివేసి రాజకీయాల గురించి మాట్లాడాలని రామచంద్రయ్యకు హితవు పలికారు.
తిరుపతిలో రామచంద్రయ్య బంధువు నైనారు శ్రీనివాసులు రెండు లాడ్జి లను నిర్వహిస్తూ అందులో పేకాట శిబిరాలు పెట్టాడని తిరుపతి జనసేన ఆరోపించింది. అదే విధంగా తిరుమల శ్రీవారి దర్శనాల టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముకుంటుంటారని వారు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి తో వ్యాపారాలు చేయించడం ముందు సి రామచంద్రయ్య ఆపాలని వారు కోరారు. చిరంజీవి ఆదరణతో రాజకీయంగా ఎదిగిన రామచంద్రయ్య ఇప్పుడు పవన్ కల్యాణ్ ను విమర్శించడం దారుణమని వారన్నారు.
మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల గాని ఏ ఒక్క సామాన్యుడికి గానీ శ్రీవారి దర్శనం కల్పించకుండా శ్రీవారి దర్శనం టికెట్లను అమ్ముకుని ఆర్థికంగా లాభపడింది మీరు కాదా వారు ప్రశ్నించారు. అదేవిధంగా తిరుపతి తిరుమల లో ఉన్నటువంటి నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పి రెండు లక్షల రూపాయలను వసూలు చేసింది మీరు కాదా అని కూడా వారు సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలు ఎన్నో చేసిన మీరు పవన్ కల్యాణ్ ను విమర్శించే స్థాయికి ఎప్పుడు వచ్చారని వారు ప్రశ్నించారు.