అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో కడప కేంద్ర కారాగారం నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు గురువారం విడుదలయ్యారు. అక్రమ వాహన రిజిస్ట్రేషన్, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల తయారీ కేసుల్లో జూన్ 13న అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు 54 రోజుల పాటు కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి బెయిలు పేపర్లు తానే స్వయంగా తీసుకొచ్చి ఇచ్చారు. వైఎస్ జగన్ పైన, ప్రభుత్వం పైన ఎవరు గళమెత్తినా అణచివేయాలని ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని టార్గెట్ చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు మంచిది కాదన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.
అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే ఎవరెవరిపై కక్ష సాధించాలో ఒక లిస్టు తయారు చేశారని, రాబోయే నాలుగేళ్లలో ఇంకా అనేకమందిని కూడా టార్గెట్ చేస్తారని జేసీ పవన్ అన్నారు.