కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం దురదృష్టకరమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించిన వేళ, భారత్లో జీ20 సమావేశాలు జరుగుతున్న వేళ రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశాన్ని, పార్లమెంటును అవమానిస్తున్నారన్నారు.
130 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. ఇది ద్రోహులను బలపరచడం కాకపోతే మరి ఏమిటి? భారత్లో ప్రజాస్వామ్యం ముగిసిపోయిందని, యూరప్, అమెరికా జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై అన్నారు. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉండదు అని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నప్పుడు, మీ ఉద్దేశ్యం ఏమిటి? అని ఆయన రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
ఇందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని జేపీ నడ్డా డిమాండ్ చేశారు. భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో, అతిపెద్ద సంక్షోభ సమయంలో కూడా, విదేశీ శక్తుల నుండి భారత ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని ఏ భారతీయ నాయకుడూ డిమాండ్ చేయలేదని నడ్డా అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇది అత్యంత తీవ్రమైన అంశం. జార్జ్ సోరోస్, రాహుల్ గాంధీ ఒకే భాష ఎందుకు మాట్లాడారని జేపీ నడ్డా ప్రశ్నించారు. అదే విధంగా పాకిస్తాన్ భాషనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుందని ఆయన ప్రశ్నించారు.
ఇటలీ ప్రధాని ప్రధాని మోదీని క్యూటెస్ట్ ప్రైమ్మినిస్టర్ అని పిలుస్తుంటారు. ప్రపంచ బ్యాంకు నుంచి ఐఎంఎఫ్ వరకు అందరూ భారతదేశ అభివృద్ధిని కొనియాడుతున్నారు. భారత్ అభివృద్ధి సాటిలేనిదని జర్మనీ ఛాన్సలర్ అన్నారు. ఆస్ట్రేలియా, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలు కూడా ప్రధాని మోదీ నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నాయి. అయితే రాహుల్ గాంధీ మాత్రం దేశాన్ని అవమానిస్తున్నారన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయానికి హాని కలిగించే శక్తి ప్రపంచంలో ఏదీ లేదు. ఈ రోజు దేశంలో మీ పార్టీ చెప్పే మాటని ఎవరూ వినడం లేదు, ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదు. మీ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోవడానికి ఇదే కారణం అని ఆయన వ్యాఖ్యానించారు.