కరోనా రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్నా వైసీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించి కడపలో విపత్కర పరిస్థితి తెచ్చారని కడప జిల్లా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్,రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి,మత్స్య శాఖ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామ్ ప్రసాద్ సంయుక్తంగా పేర్కొన్నారు.
మంగళవారం కడప నగరంలోని హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నేతల గుంపులు గా అనేక కార్యక్రమాలు నిర్వహించడం వల్లే కరోనా కేసులు పెరిగాయన్నారు. ప్రశ్నిస్తే టీడీపీ నేతలపైనే పోలీసుల చేత కరోనా నిబంధనల కేసులు పెట్టించారన్నారు.
ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులు వైసీపీ నేతల్లోనే వ్యాప్తి చెందిందని ప్రజలు గమనించాలని కోరారు. కరోనా కేసులు పెరగడానికి కారణం డిప్యూటీ సీఎం అంజాద్ బాష వెంటనున్న బృందాలదేనని స్పష్టంచేశారు. సీఎం పర్యటనతో కరోనా డొంక కదిలిందన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వైసీపీ నేతల్లో కరోనా కేసులు ధృవీకరించాలన్నారు. లేని పక్షంలో ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని గ్రహించాలన్నారు.
ప్రజలకు తెలియజేస్తే ఎవరి భద్రతలో వారుంటారని అన్నారు. గతంలో వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా వెళ్ళడాన్ని అడ్డుకోవాలని పదే పదే అధికారులను కోరామని,రిపోర్ట్ చేశామని గుర్తు చేశారు. నాడే అధికారులు అప్రమత్తం అయివుంటే ఈనాడు కరోనా తీవ్రత ఉండేది కాదన్నారు.