వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మైనారిటీ లకు జగన్ పూర్తిగా ద్రోహం చేశారని ఆరోపించారు. ముస్లింల కోసం టీడీపీ హయాంలో తీసుకు వచ్చిన దుల్హన్ పథకం, రంజాన్ తోఫా వంటి పథకాలను జగన్ నిలిపివేశారని చంద్రబాబు అన్నారు.
మౌజంలకు, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చంద్రబాబు గుర్తు చేశారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి పలు పార్టీ లకు, వర్గాలకు చెందిన నేతలు చంద్రబాబు సమక్షం లో టీడీపీ లో చేరారు. స్థానిక కదిరి నేతలు ఎస్ వి నాగేంద్ర ప్రసాద్, పూల అనిల్, కృష్ణమూర్తి తమ అనుచరులతో కలిసి టీడీపీ లో చేరారు.
వారిని చంద్రబాబు పార్టీ లోకి ఆహ్వానించారు. 2019 లో టీడీపీ మళ్ళీ అధికారం లోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో పోలవరం తో సహా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యేవని చంద్రబాబు అన్నారు. నేడు వృధాగా పోతున్న నీటితో రాయల సీమను రతనాల సీమగా మార్చే వాళ్ళమని అన్నారు. కరోనా నివారణకు కేంద్రం ఇచ్చిన 1100 కోట్లు కూడా డైవర్ట్ చేసిన సిఎం జగన్ ఇంకేమి పాలన అందిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
చెత్త పాలనలో….చెత్త రోడ్ల తో…చెత్తపై పన్నులతో జగన్ చెత్త సిఎంగా చరిత్ర లో నిలిచిపోతారని చంద్రబాబు అన్నారు. కార్యక్రమం లో కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.